రామయోగి రామయోగి రామయోగి పాహిమాం!!
రామయోగి రామయోగి రామయోగి రక్షమాం!!
భక్తులచే పూజలు అందుకుంటున్న సద్గురు శ్రీ రామాయొగీంద్ర స్వామి భగవత్ స్వరూపులు. వీరు గుంటూరు వంశస్థులైన పిచ్చి రామయ్య, లక్ష్మమ్మ దంపతులకు 1921 సం.లో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణమునకు దగ్గరగా గల సిద్దాంతం అనే గ్రామంలో ఆషాడ పౌర్ణమి (వ్యాస పౌర్ణమి) గురు పౌర్ణమి రోజున జన్మించారు. వీరిది సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబము. వీరు భారద్వాజ గోత్రీకులు. వీరి నామధేయము భీమేశ్వర శర్మ. స్వామి వారి విద్యాబ్యాసము తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి మరియు పొడగ్లపల్లి లో జరిగినది. తరువాతి కాలంలో వీరు గుంటూరు వంశస్థులైన పశ్సిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకాలోని పెదపాడు గ్రామానికి చెందిన అంబయ్య, జానకమ్మ దంపతులకు దత్తత వెళ్ళినారు వీరి దత్తత నామధేయము రామ చంద్ర రావు. చిన్న వయస్సులోనే అపారమైన ఆద్యాత్మిక జ్ఞానము కలిగి ఉండేవారు. స్వామివారు నిత్యమూ రామ సప్తాహములు, రామ భజనలు ఆద్యాత్మిక కార్యక్రమములలో నిమగ్నమై ఉండేవారు. ఇది గమణిచిన తల్లిదండ్రులు వీరికి వివాహము చేయ సంకల్పించినారు. అదే పెదపాడు గ్రామానికి చెందిన "వేము" వారి ఆడపడుచు ఐన లక్ష్మి కాంతం అనే కన్యా రత్నముతో వివాహం జరిపించినారు. వీరికి 1941 వ సం.లో అమృతాంబికేశ్వర శర్మ, 1948వ సం.లో జానకిరామ శర్మ అను ఇరువురు కుమారులు జన్మించారు. 1948లో పెద్ద కుమారుడైన అమృతాంబికేశ్వర శర్మకి ఉపనయనము గావించిన స్వామి వారు ఇంటికి కర్తను ఏర్పాటు చేసి ధర్మపత్ని అనుమతితో గృహస్థాశ్రమము వీడారు. ఆ సందర్భములో చిన్న కుమారుడైన జానకిరామ శర్మ వయస్సు కేవలం మూడు నెలలు మాత్రమే!
చిన్న కుమారుడైన జానకిరామ శర్మ తరువాతి కాలంలో దివ్యశ్రీ చినరామయోగీంద్రస్వామి అనే దీక్షా నామం వహించి కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, మేడూరు గ్రామంలో అష్టాదశ భానువార హనుమత్ దీక్షా పీఠము నెలకొల్పి అనేక యజ్ఞ యాగాదులు, ఆధ్యాత్మిక కార్యక్రమములు, రామయోగీంద్రస్వామి వారి ఆశ్రమము, కాత్యాయినీ సమేత జీవన్ ముక్తేశ్వర సహస్ర శత షోడశ బాణలింగ దేవాలయము నిర్మించి (1116) తండ్రిగారి ఆశయాలను నెరవేర్చారు.
శ్రీ రామయోగీంద్ర స్వామి వారు గృహస్థాశ్రమము వీడిన తరువాత హిమాలయ పర్వత ప్రాంతములో 12 సం.రాలు కఠోర తపస్సును ఆచరించి భగవత్ సాక్షాత్కారము పొంది రామ యోగిగా దైవముచే పిలువబడి వారి గురువుల యొక్క ఆదేశము ప్రకారం రామ నామాన్ని మరియు రామ తత్వాన్ని ప్రచారము చేయుటకు ప్రజా క్షేత్రములోకి వచ్చారు.
శ్రీ రామయోగీంద్ర స్వామి వారికి ఆడంబరములు, ప్రచార ఆర్భాటములు, పొగడ్తలు, పాద పూజలు వీరికి అస్సలు ఇష్టము ఉండేదివి కావు. ఇలాంటి వాటికి స్వామి వారు దూరముగా ఉండేదివారు. చాలా నిరాడంబర జీవితము గడిపేవారు. ఎన్ని కార్యక్రమములు చేసిననూ ధనమును మాత్రము స్వీకరించేవారు కారు. వచ్చిన ధనమును రామ కార్యముల నిమిత్తము ఖర్చుపెట్టి మిగిలిన పైకమును బీదవారికి ఇచ్చివేసి మరొక గ్రామమునకు వెళ్ళేడి వారు.
స్వామియే సర్వస్వమని, దైవముగా కొలిచే భక్తులకు ఎల్లవేళలా వెన్నంటి కాపాడేవారు. ఎంతోమంది భక్తులకు తమ యొక్క తపశక్తితో, ఆశీస్సులతో వారియొక్క దారిద్యములను పారద్రోలి జగత్ పూజ్యులుగా, సిద్ద పురుషులుగా, అవధూతగా ప్రసిద్ది వహించారు.
స్వామివారిని కీర్తిస్తూ, స్తుతిస్తూ ఎంతోమంది కవులు, కళాకారులు, పండితులు గ్రంధములు, గేయములు, ఉపన్యాసములు గావించారు. అయితే అవన్నీ స్వామివారు స్వీకరించేవారు కాదు. రామగానము అనిన స్వామివారికి మహా ప్రీతి. ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నము పెడితే అదియే శ్రీరామ రక్ష అవుతుందని భక్తులకు బోధించేవారు.
స్వామివారి ఆశీస్సులతో "సహజ కవిగా" పేరుపొందిన గంపలగూడెం మండలం, చింతలపాడు గ్రామానికి చెందిన కారుమంచి సీతారామయ్య గారు శ్రీహారము అనే గ్రంధములో ...
తల్లిగ, తండ్రిగా, గురువు - దైవముగా మిము నా మనంబునన్
ఎల్లసువేళలన్ దలచి - యేర్పడ జేసితి నెంతో భక్తి, మీ
చల్లని చూపులో నను వి - చార మెరుంగని రీతిలో, మనో
వల్లరి పల్లవించగల - వైఖరినిచ్చిన రామ యోగి!
అని ఎంతో భక్తితో ప్రార్ధించారు.
ప్రముఖ రచయిత మక్కపేట గ్రామానికి చెందిన ఆజ్మీర్ వీర భద్రయ్య గారు.
శ్రీ మహా గురువర్య! శ్రీరామ యోగీన్ద్ర వేదా ధర్మా రక్ష!విమలచరిత !
భక్త శిష్యావళీ పావనోద్ధారకా! ధర్మ నిర్వహణార్ధ ధరణి జనుత!
విశ్వమానవ ధర్మ విజ్ఞాన దాయకా! ఋషిపుంగవా! మహా ప్రేమ మూర్తి!
ప్రాచీన భారత వైభవోద్దారకా! చైతన్య విస్పూర్తి సత్యధామ!
దీన జనులను బ్రోచెడి దీక్షతోడ!
క్రతువులొనరింప జేసిన జ్ఞాన యోగి!
భగవదాంకితమైనట్టి భక్త యోగి!
బ్రహ్మ తత్వజ్ఞులైన శ్రీరామ యోగి!
అని తన మనస్సులో మాట ద్వారా కీర్తించారు.
అదే విధంగా చిలకలూరిపీట పట్టణము కి చెందిన లెక్చరర్ గర్నెపూడి అనంతరామ శర్మ గారు రామయోగేంద్ర స్వామి వారి తత్వము ని గురించి Rama and Ramayogi ( రాముడు - రామయోగి)అనే గ్రంధము లో 108 ఆంగ్ల పద్యములను, తెలుగు అనువాదము ను " సుమ మాల" ( శ్రీ రామయోగీంద్ర ప్రస్తుతి) అనే పేరు తో రచించి శ్రీ రాముని కి అంకితం చేశారు. ఆ గ్రంధము లో ని ఒక చక్కటి మాట ---
Life and death are at at his will,
Rich and poor are same to Him,
Peace and patience are Owned by Him ,
Joys and Sorrows can not touch Him
Praises and curses can not move Him,
He's Ramayogi , the all in one.
భావం :
"జనన మరణములు తన యధీనములు
ధనికులు బీదలు తనకొక తెరగు
శాంతి సహనములు సొంతముల్ తనకు
సుఖ దుఃఖముల్ తను సోక వెన్నడును
భూషణ దూషణమ్ములు నంటబోవు
అన్నింట దానొక్కడౌ రామయోగి."
అని చాలా చక్కగా వివరించారు.
స్వామి వారి బాల్య స్నేహితులు మహాకవి, విద్వాన్ శ్రీ దేవరకొండ చిన్ని కృష్ణ శర్మ గారు "శ్రీ రామయోగీశ్వర శతకం", ప్రపత్తి , మంగళాష్టకము , అనే గ్రంథాన్ని రచించారు.
ఆ గ్రంథానికి తొలి పలుకుని మధుర కవి శ్రీ కొలిపాక మధుసూదన రావు గారు రచించారు.
శ్రీ చిన్ని కృష్ణ శర్మ గారు స్వామి వారి గురించి ఆశువుగా చెప్పిన పద్యం స్వామి వారి తత్వమును వివరిస్తుంది
ఎవడు ముట్టిన తృణము మేరువయి వెలయు
ఎవడు విడిచిన మేరువు తృణ సమమగు
అట్టి శ్రీ రామయోగీంద్రు నాత్మవిదుని
సర్వ గురునిగ నెంచి యంజలి ఘటిoతు.
స్వామి వారి దివ్య స్వరూప , స్వభావాల గురించి ఎందరో కవులు , రచయితలు , పండితులు తమకు తోచిన విధంగా అభివర్ణించి తమ సంతోషమును , భక్తి ప్రపత్తులను వెల్లడించారు. అట్టి వారిలో "సాహిత్య భూషణ " శ్రీ పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు గారు,
కొలిపాక మధుసూదన రావు గారు , కారుమంచి సీతారామయ్య గారు, "కవి భూషణ" శ్రీ యర్రం విశ్వనాథ గుప్త గారు ఇంకా ఎందరో కవులు ఉన్నారు .అదే విధంగా స్వామి వారు కుమారులు దివ్య శ్రీ చిన రామయోగేంద్ర స్వామి వారు " శ్రీ రామయోగీంద్ర స్వామి వారి అష్టోత్తరశత నామావళి " రచించారు.
ఎందరో భక్తుల అనుభవాలను ఒక గ్రంథ రూపంగా రూపొందించాలి అనుకొని స్వామి వారి భక్తులు మరియు రచయిత అయినటువంటి శ్రీ పొన్నపల్లి చిదంబర శాస్త్రి గారు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి "శ్రీ రామయోగేంద్ర స్వామి వారి లీలలు" అను గ్రంథమును రచించి ముద్రింప చేశారు . ఆ గ్రంథములో రామయోగేంద్రులు చూపిన మహిమలను భక్తులు గొప్పగా అనుభవీకరించారు.
వాటిలో - కిష్టారం గ్రామంలో శ్రీ జ్యేష్ట అప్పారావు గారింట్లో గొడ్డు మోతు గేదె నుండి పాలు తీయించుట,మహ్మదీయుని మనసు దోచుట మొదలగు లీలలు ఎన్నో కలవు. ఖమ్మం పట్టణములో వాసవి కన్యకా ప్రమేశ్వరి దేవ స్థానంలో జరిపించిన కోటి కుంకుమ పూజ కార్యక్రమములో స్వామివారు చూపిన మహిమ అద్బుతం. ఆ విశేహములను గూర్చి తెలిపే గ్రంధం సింధూర తిలకం ..
మహానంది క్షేత్రంలొ ఒకే వేదిక మీద 1991లొ 1188 సీతారామ కళ్యాణములు 1188 మంది దంపతులచే స్వామి వారు మహా వైభవముగా జరిపించారు. ఆ కళ్యాణ విశేషములన్నీ కలియుగ వైకుంఠం అనే గేయ గ్రంధంలో సహజ కవి కారుమంచి సీతారామయ్య గారు చక్కగా రచించారు. ఈ గేయములన్నీ చక్కగా గానము చేయుటకు అనుకూలముగా ఉన్నవి. అదేవిధముగా రామయోగీంద్ర స్వామి వారు తన యొక్క ఆధ్యాత్మికతకు మూల స్థానమైన మేడూరు గ్రామమును "మేడలూరు" (అనగా పూరీ గుడిసెలతో ఉండే గ్రామం మేడలు, ధనిక పట్టణముగా) మారుతుందని స్వామి వారు దీవించారు. ఆ విశేషములను గూర్చి స్వామి వారి భక్తురాలైన శ్రీమతి జేష్ట స్వయం ప్రభ గారు అదిగో.. అదిగో.. మేడూరు అతి సుందర కట్టడములతో రూపు దిద్దికుంటున్న మేడలూరు అను గేయమును స్వయముగా రచించి గానం చేశారు.
శ్రీ రామయోగీంద్ర స్వామి వారిలో ఒక వంక ధర్మ ప్రతిష్టాపన కార్యక్రమం, వేరొక వంక దీనజనోద్ధరణ, భక్త పాలనా తత్పరత ఇవన్నీ నూటికి నూరు పాళ్ళు నెలకొని ఉన్న గుణాలు. ఈ మహనీయుని వాక్కు వెంటనే అర్ధ సిద్దులు తారాడుతుంటాయి. అన్నది జరుగుతుండడమో, జరగబోయేది అంటూ ఉండడమో స్వామి వారికి వాచో విధేయం కావడం వారి తపస్సిద్ధినీ, అనుష్టాన బలాన్ని దైవీ స్వభావాన్ని చెప్పక చెబుతున్నది. ఢిల్లీ, కలకత్తా, మద్రాసు వంటి మహానగరాలలో సైతం దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు నిర్వహించి అక్కడి భక్తులను ప్రభావితులను చేశారు. భాగవత జన్మ స్థలమైన బృందావన క్షేత్రంలో భాగవత సప్తాహములు జరిపించారు. స్వామి వారిని శ్రీకృష్ణుని అవతారముగా కొందరు భక్తులు, ఆంజనేయ స్వామి అవతారముగా కొందరు భక్తులు, శిరిడీ సాయినాధుని అవతారముగా మరికొంత మంది భక్తులు కొలుస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులను వెన్నంటి కాపాడి జ్ఞానమును ప్రసాదించిన శ్రీ రామాయొగీంద్ర స్వామి వారు 1992 వ సం.లొ మాఘ బహుళ షష్టి రోజున శివైక్యము చెందారు.
శ్రీ స్వామి వారి పేరుతో మేడూరు గ్రామములొ శివాలయము, జ్ఞాన మందిరము, శివసాయి రామయోగీంద్ర హనుమత్ క్షేత్రము నిర్మింపచేశారు.
రామయోగి రామయోగి రామయోగి పాహిమాం!
రామయోగి రామయోగి రామయోగి రక్షమాం!!
అను నామము నిత్యమూ స్మరించుకోదగినది.
Note: Subject to correction any above.