దివ్య శ్రీ చిన రామయోగేంద్ర స్వామి వారు

Divyasri china raamayogendra swami

దివ్యశ్రీ చిన రామ యోగీంద్ర స్వామి

ఓం యోగి శ్రీయోగి జయరామ యోగి!

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి!!

కృష్ణా జిల్లా, గంపల గూడెం మండలం , మేడూరు గ్రామములొ పంచానన వీర్రాడుపీ అష్టాదశ భానువార హనుమద్దీక్షా   పీఠ వ్యవస్థాపకులు  ఐన దివ్యశ్రీ  చినరామ యోగీంద్ర స్వామి వారు  పశ్సిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా  పెదపాడు గ్రామంలో 1948 సం.లో మార్గశిర పౌర్ణమి రోజున జన్మించారు. వీరి తల్లి దండ్రులు గుంటూరు లక్ష్మీ కాంతం,  రామచంద్ర రావు. వీరి జన్మ నామము గుంటూరు జానకిరామ శర్మ.  వీరికి 3 నెలల వయస్సులో తండ్రి గారైన రామ చంద్ర రావు  గారు ( భవిష్యత్  కాలంలో జగద్గురువు  శ్రీ రామ యోగీంద్ర స్వామి వారు) దైవ ఆదేశం ప్రకారం గృహస్థాశ్రమం  వీడి, వీరి అన్నగారైన అమృతాంబికేశ్వర శర్మ కు 8 సం..ల వయస్సులో ఉపనయన సంస్కారములు చేసి ఇంటికి  కర్తను  ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన  కొరకు దేశాటనం వెళ్లారు.

అప్పటి నుండి తల్లిగారైన లక్ష్మి కాంతం గారు ఇద్దరు బిడ్డల్ని పెంచి పెద్ద చేశారు.   స్వామి వారు తరువాత కాలంలో అన్న గారైన అమృతాబికేశ్వర శర్మగారి సంరక్షణలో ఉండి గుంటుపల్లి రైల్వే  వ్యాగను వర్క్ షాపులో ఉద్యోగంలో చేరారు.  వీరు చిన్న వయస్సు నుండే  తండ్రి గారి లాగా ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనతో  ఉండే వారు.  వీరికి 25 సం.ల వయస్సులో పెదపాడు గ్రామానికి చెందిన వలివేటి వారి ఆడపడుచు సంధ్యారాణి  (భవిష్యత్ కాలంలో  మాతృ శ్రీ విజయమ్మ) తో వివాహము జరిగినది. వీరు కమ్యూనిస్టు  పార్టీలో చురుకుగా పనిచేసేవారు.  తండ్రిగారైన రామ యోగీంద్ర స్వామి వారు తమను చిన్న వయస్సులోనే వదలి వెళ్లారనే బాధతో ఉండేవారు. కొంతకాలానికి దైవ నిర్ణయం మేరకు తండ్రీ కొడుకుల సమాగమం మచిలీ పట్నంలో జరిగింది.  ఆ రోజున తండ్రిగారు తెలియపరచిన  జ్ఞాన విషయాలు విని ఎంతో ఊరట చెంది, తండ్రి గారి పట్ల పూజ్య భావం ఏర్పరచుకున్నారు. 1992 సం.లో ఖమ్మం పట్నంలో తండ్రిగారు శివైక్యము చెందిన రోజునే తాను కూడా తండ్రి గారి బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు.

తదనుగుణంగా తనకు తానుగా  ఆధ్యాత్మిక ప్రయాణం సాగించారు. విజయవాడ వాస్తవ్యులైన లంకా వెంకట సుబ్బావధానులు గారి వద్ద మంత్రోపదేశం పొందారు.  స్వామి వారికి ధర్మపత్ని  మాతృశ్రీ విజయమ్మ గారు పూర్తిగా సహకరించారు. తండ్రిగారైన రామ యోగీంద్ర  స్వామి వారి మూల స్థానమైన  మేడూరు గ్రామానికి వచ్చి తండ్రిగారి ఆశయాల సాధనకై కృషి చేశారు.  గ్రామ గ్రామాన పర్యటించి తండ్రి గారి భక్తకోటిని కలుసుకొని వారి అనుభవాలు తెలుసుకున్నారు.   మేడూరు  గ్రామానికి చెందిన రామ యోగీంద్ర స్వామివారి భక్తులు ముత్యాల సీతారామయ్య గారు కొంత స్థలమును దానం ఇవ్వగా ఆ స్థలములో గీతాజ్ఞాన మందిరం, రామ యోగీంద్రస్వామి వారి ఆశ్రమం, అష్టాదశ భానువార  హనుమద్దీక్షా  పీఠం ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో మందిని శిష్యులుగా స్వీకరించి  కుల, మతాలకు అతీతంగా అందరినీ  భగవత్   ఆరాధనకు అర్హులను చేశారు. 2000-2001 సం..లో  మాహా మృత్యుంజయ జప, (దోస)  యజ్ఞము  కనీ వినీ ఎరుగని రీతిలో 108 రోజులు నిర్వహించారు. ఆ తరువాత వీరి శిష్య బృందం వీరికి దివ్యశ్రీ చిన రామ యోగేంద్ర స్వామి అను దీక్షా  నామం వహింపచేశారు.

స్వామివారు  స్వప్నములో  మేరువు శ్రీచక్ర ఆకారములో  శివాలయం దర్శించారు. తండ్రిగారైన రామ యోగేంద్ర  స్వామి వారి ఆశీస్సులతో  శ్రీచక్ర ఆకారంలో సహస్ర లింగ దేవాలయం నిర్మించారు. పెనుగంచి ప్రోలు సమీపమున గల మక్కపేట గ్రామమునందు గల కాకతీయుల కాలము నాటి శివలింగము పూజాదికములు నోచుకోక ఉండుట గమనించి ఆ శివలింగమును మేడూరు గ్రామమునకు తీసుకొని వచ్చి 108 రోజులు అభిషేకము జరిపించారు. ఆ మూల విరాట్టే జీవన్ ముక్తేశ్వర స్వామి.  ఎంతోమంది భక్తులు, దాతలు దేవాలయము నిర్మాణమునకు సహకరించారు. సహస్ర లింగ దేవాలయము 1116 బాణ లింగములను నర్మదా నది నుండి తీసుకొని వచ్చి 1116 మంది దంపతులచే ప్రతిష్టలు గావించారు. ఈ దేవాలయము శివ పంచాయతన విధానములో రెండు అంతస్తులలో కట్టబడినది. క్రింద గర్భాలయములో జీవన్ ముక్తేశ్వర  స్వామి, పై గర్భాలయములో పంచ ముఖేశ్వర లింగము ప్రతిష్టించడం జరిగింది.  క్రింది అంతస్తులో 8 మంది అమ్మవార్లను ప్రతిష్టించడం జరిగింది.ఈ దేవాలయం నకు ఉత్తర భాగములో షిరిడీ సాయి నాధుని మందిరం నిర్మించారు. దేవాలయముకు ప్రతిష్ట కార్యక్రమాల సమయంలో  మరలా రెండవసారి మహా మృత్యుంజయ జప (దోస) యజ్ఞము, ఎన్నో సప్తాహములు, సప్త సప్తాహములు లెక్క లేనన్ని యజ్ఞములు నిర్వహించారు. స్వామి వారు  నిర్వహించిన యజ్ఞములలో 

 1) లక్ష్మీ గణపతి యాగము, 

2) నక్షత్ర యాగము, 

3) లక్ష్మి నారాయణ యాగము, 

4) నవ దుర్గా యాగము, 

5) సౌర యాగము, 

6) గాయత్రీ యాగము, 

7) పుత్ర కామేష్టి యాగము, 

8) పంచముఖీ హనుమత్ యాగము, 

9) రుద్ర యాగములు, 

10) చండీ యాగములు,

మరెన్నో కలవు.

వీరు హనుమాన్ చాలీసాను ప్రతి ఆదివారం ఏదో ఒక గ్రామంలో 108 సార్లు  పారాయణను  నిరాటంకముగా 6 సం.ల పాటు కొనసాగించారు.

వీరి తపః శక్తి వలన మరియు వీరి ఆశ్శీస్సుల వలన ఎంతో మంది  ఈతి బాధల నుండి గట్టెక్కారు. వీరి ప్రభావము వలన మేడూరు పరిసర గ్రామాలలో హనుమదాలయములు, రామాలయములు వెలిశాయి. ఎంతో మంది ప్రజానీకం హనుమాన్ చాలీసా భజన మండళ్ళు ఏర్పాటు చేసుకున్నారు.

తన తండ్రి గారైన రామ యోగీంద్రస్వామి వారి పేరిట రామ యోగీంద్రస్వామి వారి ఆశ్రమం ఏర్పాటు చేసుకొని అన్నపూర్ణకావడి ద్వారా నిత్యం అన్నదానం జరిపించారు. ఈ విషయములో  మాతృశ్రీ విజయమ్మ గారు ఎంతో శ్రద్ద కనపరచేవారు. తరువాత మాతృ శ్రీ విజయమ్మ గారు అనారోగ్యము చేత 2015 శ్రావణ బహుళ షష్ఠి రోజున శివైక్యము చెందారు. ధర్మపత్ని లేని లోటు స్వామివారిని మానసికముగా క్రుంగదీసింది.  వారు కూడా అనారోగ్య కారణంగా 2018 మాఘ బహుళ అమావాస్య రోజున శివైక్యము చెందారు.

ఓం యోగి శ్రీయోగి జయరామ యోగి!

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి!!